అనంతపురం పి.టి.సి (పోలీసు శిక్షణ కళాశాల) లో నవంబర్ 13 & 14 తేదీలలో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారని అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణా టాటా IPS గారు పేర్కొన్నారు. చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ను ఆయన ఈరోజు అనంతపురం రేంజ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రాచీన క్రీడ అయిన చదరంగం ఆటను ప్రోత్సహించాలనే సదుద్ధేశ్యంతో గౌరవ రాష్ట్ర డి.జి.పి దామోదర్ గౌతం సవాంగ్ IPS గారు చెస్ టోర్నమెంటు వేదికకు స్థానిక పి.టి.సి కి అనుమతి ఇచ్చారు. రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు పి.టి.సి ల అదనపు డి.జి.పి ఎన్ సంజయ్ IPS గారి సారధ్యంలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణా టాటా IPS గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగనుంది.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఆర్గనైజర్ గా ఆల్ అనంతపురం చెస్ అసోసియేషన్ ... కో ఆర్గనైజర్ గా ఏ.పి పోలీసు ఈ ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్-2021 (ALL INDIA OPEN FIDE RAPID RATING CHESS TOURNAMENT - 2021 ) నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంటులో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. మొత్తం రూ. 2 లక్షల నగదు ప్రైజ్ ఫండ్ ఉంటుంది. 85 నగదు బహుమతులు, 55 ట్రోఫీలు, 40 మెడల్స్ బహుకరించనున్నారు. విన్నర్ కు రూ. 30,000/- నగదు బహుమతి మరియు ట్రోఫీ... రన్నర్ కు రూ. 20,000/- నగదు బహుమతి మరియు ట్రోఫీ అందజేయనున్నారు. ఎంట్రీ ఫీజు రూ. 1000/- ఉంటుంది. టోర్నమెంటులో పాల్గొనేవారు www.apchess.org లో నమోదు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఫిడే మాస్టర్లు మొత్తం 300 పైగానే పాల్గొననున్నారు. చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాలరాజు, అధ్యక్షులు శివకుమార్ , కార్యదర్శి మరియు టోర్నమెంట్ డైరెక్టర్ ఉదయకుమార్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
